హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ సమయాత్తం అవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 2023 సీజన్లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అత్యుత్సాహం.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తప్పిదాలు ఆ జట్టు కొంపముంచాయి.
ఫైనల్లో ఓడినా.. గుజరాత్ సూపర్ క్రికెట్తో అభిమానులను అలరించింది. ముఖ్యంగా సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు విజయాలందుకుంది. జట్టు ప్రతీ ఆటగాడు తమ వంతు ప్రదర్శన కనబర్చారు. ఏ ఒక్కరి మీదనో ఆధారపడకుండా ఆ జట్టు విజయాలందుకుంది.

జట్టులో ఎలాంటి బలహీనతలు లేకపోయినప్పటికీ.. అనవసరం అనుకునే ఆటగాళ్లను వదులుకునేందుకు ఆ జట్టు సిద్దమైంది. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం సిద్దమవుతోంది. ఇప్పటికే వదులుకునే ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేసింది. కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, మాథ్యూ వేడ్లతో పాటు యశ్ దయాళ్, ప్రదీప్ సంగ్వాన్లను వదులుకోవాలని భావిస్తోంది.
వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై కూడా గుజరాత్ టైటాన్స్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఓ ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు గుజరాత్ టైటాన్స్ సిద్దమవుతోంది. ఇక ఐపీఎల్ 2024 వేలానికి ముందు బీసీసీఐ.. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గుజరాత్ స్టార్ ఆటగాళ్లను తీసుకునేందుకు కూడా పోటీ పడనుంది.
1. సామ్ కరణ్..:
ఐపీఎల్ 2023 సీజన్లో సామ్ కరణ్ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ అంచనాలను అతను అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసాడు. బ్యాటింగ్లోనూ 276 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ అతన్ని వదులుకునే అవకాశం ఉంది. అదే జరిగితే గుజరాత్ టైటాన్స్ సామ్ కరణ్ను టార్గెట్ చేయనుంది.

2. రాహుల్ త్రిపాఠి:
సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ త్రిపాఠిని తీసుకునేందుకు కూడా గుజరాత్ టైటాన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మిడిలార్డర్లో ఆడగలిగే దేశవాళీ బ్యాటర్ కోసం గుజరాత్ ప్రయత్నిస్తోంది. అలాగే సత్తా కలిగిన వికెట్ కీపర్ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.
2.ప్యాట్ కమిన్స్..:
వ్యక్తిగత కారణాలతో గత సీజన్కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్ను తీసుకునేందుకు గుజరాత్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన ప్యాట్ కమిన్స్ అసాధారణ బౌలింగ్, బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ప్యాట్ కమిన్స్ చేరికతో జట్టు బ్యాటింగ్ లైనప్ బలోపేతం అవుతుందని గుజరాత్ భావిస్తోంది.