హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సన్రైజర్స్.. ముందుగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2023 సీజన్ వైఫల్యానికి లారానే బాధ్యుడ్ని చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బ్రియాన్ లారా సైతం ఐపీఎల్ కోచింగ్కు సుముఖంగా లేడని తెలుస్తోంది. ప్రస్తుతం అతను వెస్టిండీస్ టీమ్కు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్ కోసం వేట ప్రారంభించినట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అత్యంత దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ చెత్త ప్రదర్శన కనబర్చి అభిమానులను నిరాశపరిచింది. 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సన్రైజర్స్.. పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన.
సన్రైజర్స్ పేలవ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించడం హాట్టాపిక్గా మారింది. సన్రైజర్స్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో టీమ్ ఓనర్ కావ్య మారన్ పడే బాధను తాను చూడలేకపోతున్నానని రజనీకాంత్ అన్నారు. ఆమె బాధపడటం చూడలేక టీవీ చానెల్ మార్చానని తెలిపారు. తన అప్కమింగ్ మూవీ 'జైలర్'ను కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ నిర్మించారు.
ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో తలైవా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వైఫల్యాన్ని ప్రస్తావించారు. అప్కమింగ్ సీజన్లోనైనా మంచి ఆటగాళ్లను తీసుకొని జట్టును పటిష్టం చేయాలని కళానిధి మారన్ను కోరారు. రజనీకాంత్ సూచనలతో సన్రైజర్స్ వ్యవహారాన్ని కళానిధి మారన్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే టీమ్ ప్రక్షాళన ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా హెడ్కోచ్ను మార్చాలని కావ్యమారన్ నిర్ణయించినట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త కోచ్గా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే బాగుంటుందని, పంజాబ్ కింగ్స్ మెంటార్గా.. ఐపీఎల్ ఆడిన అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని సన్రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తుందని జట్టుకు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఇప్పటికే సెహ్వాగ్ను సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంప్రదించిందని, అతని రియాక్షన్ కోసం ఎదురు చూస్తుందన్నారు. అతనితో పాటు టామ్ మూడీ, రవి శాస్త్రి, మైక్ హెస్సెన్ పేర్లను కూడా పరిశీలిస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు. సన్రైజర్స్ అభిమానులు మాత్రం సెహ్వాగ్ను కోచ్గా నియమించాలని కోరుతున్నారు.