ఐపీఎల్ 2024 సీజన్లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టోర్నీలో ముందడుగు వేయనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఈ ఎలిమినేటర్లో గెలిచిన జట్టు శుక్రవారం చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన ఆర్సీబీ.. అదే జోరులో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి టోర్నీలో ముందడుగు వేయాలనుకుంటోంది.

ఈ టోర్నీ ఫస్టాఫ్ సీజన్లో 8 మ్యాచ్లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్దమైంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్.. టోర్నీ ఆరంభంలో అసాధారణ ప్రదర్శన కనబర్చింది.
టేబుల్ టాపర్గా కొనసాగింది. కానీ చివరి ఐదు మ్యాచ్ల్లో అనూహ్యంగా వరుసగా నాలుగింటిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారిగా ఢీలా పడింది. కేకేఆర్తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానాన్ని అందుకోలేకపోయింది. పేపర్పై రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తున్నా.. ఫామ్ పరంగా ఆర్సీబీ భీకరంగా కనిపిస్తోంది.

అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా క్వాలిఫయర్-1లా ఏక పక్షంగా సాగే అవకాశం ఉందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ను ఆర్సీబీ చిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ ముందు రాజస్థాన్ రాయల్స్ తేలిపోతుందన్నాడు.
'ఓవైపు రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. తమ చివరి మ్యాచ్ల్లో ఆ జట్టు గొప్ప ప్రదర్శన చేయలేదు. చివరి మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో ఆ జట్టుకు ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఆ జట్టు విజయం సాధించాలంటే కేకేఆర్ తరహా ప్రత్యేకమైన ప్రదర్శన చేయాలి. ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగిసే అవకాశం ఉంది. నా భయం కూడా ఇదే. భీకర ఫామ్లో ఉన్న ఆర్సీబీ చేతిలో రాజస్థాన్ చిత్తుగా ఓటమిపాలవుతుందని అనిపిస్తోంది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.