టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్పై గవాస్కర్ విమర్శలు గుప్పించగా.. కోహ్లీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు.
కోహ్లీ వ్యాఖ్యలపై గవాస్కర్ కూడా ఘాటుగా స్పందించాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఇక ఈ సీజన్ ఫస్టాఫ్లో దారుణంగా విఫలమైన ఆర్సీబీ సెకండాఫ్లో దుమ్మురేపుతోంది. తొలి 8 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ.. తర్వాత 5 మ్యాచ్లకు ఐదు గెలిచింది.

ఈ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ఆర్సీబీ.. చెన్నై సూపర్ కింగ్స్తో డూ ఆర్ డై మ్యాచ్కు రెడీ అయ్యింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కనుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ హైఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కారణంగా కోహ్లీ స్టార్ క్రికెటర్ అయ్యాడని, అతనే లేకుంటే కోహ్లీ ఈ స్థాయికి చేరేవాడు కాదని చెప్పాడు.
'కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇబ్బందులు పడ్డాడు. అతను నిలకడగా రాణించలేకపోయాడు. ఓ మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్లో విఫలమయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీకి ధోనీ అండగా నిలిచాడు. అతనికి వరుసగా అవకాశాలు ఇచ్చి అతనికి ఎక్స్ట్రా మూమెంటమ్ ఇచ్చాడు. దాంతోనే విరాట్ కోహ్లీ ఈ స్థాయికి చేరగలిగాడు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టే ప్లే ఆఫ్స్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోదన్నాడు. కీలక మ్యాచ్లు గెలవడం సీఎస్కేకు వెన్నతో పెట్టి విద్య అని, ఆ జట్టుకు ఎన్నో ప్లే ఆఫ్స్, ఫైనల్స్ ఆడిన అనుభవం ఉందని గుర్తు చేశాడు.
శనివారం జరిగే మ్యాచ్లో సీఎస్కే 201 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే 18.1 ఓవర్లలోనే చేధించాలి. ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి.
అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. బెంగళూరు నగరంలో శనివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్లు లభిస్తుంది.