ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. గతేడాది కంటే ఆ జట్టు ఈ సారి మరింత బలంగా ఉందన్నాడు. ఇక 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ 14 సీజన్లు ఆడి 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచి అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ముంబైతో సమంగా నిలిచింది.
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో సునీల్ గవాస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ 2024 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గతేడాది చెన్నై బ్యాటింగ్, బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపించింది. వేలంలో ఈ బలహీనతలను చెన్నై అధిగమించింది. రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడి స్థానాన్ని కూడా భర్తీ చేస్తింది. ఆ జట్టు అనుభవంతో పాటు కుర్రాళ్లతో కలగలిపి సమతూకంగా కనిపిస్తోంది.

కాబట్టి సీఎస్కే కచ్చితంగా టాప్-4లో నిలుస్తోందని చెబుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్ను తప్పా మరే జట్టును కూడా టైటిల్ ఫేవరేట్ అని కచ్చితంగా చెప్పాలేం. చెన్నై సూపర్ కింగ్స్ అలాంటి ప్రదర్శన కనబర్చింది. 16 ఎడిషన్స్లో 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కాబట్టి 13వ సారి కూడా సునాయసంగానే ప్లే ఆఫ్స్ చేరనుంది.
సీఎస్కేకు బ్యాకప్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. గాయంతో దీపక్ చాహర్ దూరమైతే అతని స్థానాన్ని శార్దూల్ ఠాకూర్తో భర్తీ చేయవచ్చు. తుషార్ దేశ్పాండే ఫిట్గా ఉన్నాడు. గతేడాది ఆడకున్నా.. అంతకుముందు ముఖేష్ చౌదరి సత్తా చాటాడు. కాబట్టి కొత్త బంతితో బౌలింగ్ చేసే బౌలర్ల విషయంలో చెన్నైకి ఎలాంటి సమస్య లేదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మార్చి-మే మధ్య ఐపీఎల్ విండోను ఖరారు చేసిన బీసీసీఐ.. షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్పై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆ తేదీలకు అనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ను ఖరారు చేయాలని భావిస్తోంది.