ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే తమ సారథిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను నియమించింది. గతేడాది కెప్టెన్గా జట్టును నడిపించిన ఎయిడెన్ మార్క్రమ్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ను రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో అతని కోసం తీవ్రంగా పోటీ పడింది. ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేసిన వెంటనే అతనే సన్రైజర్స్ సారథి అని అంతా భావించారు. కాస్త ఆలస్యమే అయినా అదే నిర్ణయాన్ని సన్రైజర్స్ ప్రకటించింది.

అయితే ఈ నిర్ణయాన్ని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు తప్పుబడుతున్నారు. ఇది తెలివి తక్కువ నిర్ణయమని మండిపడుతున్నారు. ప్రతీ సీజన్లో జట్టు కెప్టెన్ను మారిస్తే ఫలితం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు జట్టుకు సేవలందించిన డేవిడ్ వార్నర్పై వేటు వేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. కేన్ విలియమ్సన్ను తమ సారథిగా కొనసాగించింది.
అతని సారథ్యంలోనూ జట్టు దారుణంగా విఫలమైంది. దాంతో అతనిపై కూడా వేటు వేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో తమ జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన ఎయిడెన్ మార్క్రమ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. గత సీజన్లోనూ సన్రైజర్స్ దారుణంగా విఫలమైంది. దాంతో మార్క్రమ్ కెప్టెన్సీపై కూడా వేటు వేసి ప్యాట్ కమిన్స్కు అప్పగించింది.
ఇలా ప్రతీ సీజన్కు ఓ కెప్టెన్ను మార్చడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్లు మారిస్తే టైటిల్ రాదని, విజేతగా నిలవాలంటే సమష్టిగా రాణించాలని కామెంట్ చేస్తున్నారు. కెప్టెన్పై నమ్మకం ఉంచడం కూడా కీలకమని, సౌతాఫ్రికా టీ20 లీగ్లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మార్క్రమ్ను తప్పించడం అన్యాయమని మండిపడుతున్నారు.
కావ్య మారన్ చేసిన అతి పెద్ద తప్పని, కెప్టెన్లను మారిస్తే టైటిల్ రాదమ్మా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. వేలంలో విదేశీ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టే బదులు.. దేశీయ ఆటగాళ్లపై ఖర్చు చేసి ఉంటే ఫలితం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుందని, దేశీయ ఆటగాళ్లు రాణిండంపైనే సన్రైజర్స్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. దేశీయ ఆటగాళ్లు రాణించకుంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కూడా అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.