సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. సన్రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే కావ్య మారన్ను చూసేందుకే మైదానాలకు వెళ్లే అభిమానులు ఉన్నారు. సినీ హీరోయిన్ తలపించే ఆమె అందానికి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.
ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్మన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్ అవుతాయి.

గాయత్రి రెడ్డి తెలుసా..?
గత ఐదారేళ్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్గా తమ జట్టు ఆడే ప్రతీ మ్యాచ్కు హాజరవుతూ కావ్య మారన్ స్టేడియంలో సందడి చేస్తోంది. అయితే కావ్య మారన్ కంటే ముందే హైదరాబాద్ అభిమానులను గాయత్రి రెడ్డి తన అందచందాలతో అలరించింది. అందమే అసూయ పడేలా ఉండే గాయత్రి రెడ్డికి కావ్య మారన్ తరహాలోనే అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది.
కావ్య పాపలానే ఆమె ప్రతీ మ్యాచ్కు హాజరవుతూ.. తన హవాభావాలతో ఆకట్టుకునేది. సోషల్ మీడియా అంతగాలేని ఆ రోజుల్లోనే గాయత్రి రెడ్డి చాలా ఫేమస్. బాలీవుడ్ హీరోయిన్ను తలపించే ఆమె అందానికి అభిమానులు పడి చచ్చేవారు. ఇప్పటి టీనేజీ కుర్రాళ్లకు ఆమె గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. అప్పట్లో టీవీలు, పేపర్లలో మాత్రమే ఐపీఎల్ చూసిన అభిమానులకు గాయత్రి రెడ్డి పేరు సుపరిచితమే.

న్యూస్ పేపర్లలో గాయత్రి ఫొటోల కోసం..
సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ముగిసిన తెల్లారి న్యూస్ పేపర్లో గాయత్రి రెడ్డి ఫొటో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేది. అప్పటి టాబ్లాయిడ్ పేపర్లలో మ్యాచ్కు సంబంధించిన ఫొటోలను ప్రత్యేకంగా ఇచ్చేవారు. వాటిలో గాయత్రి రెడ్డి ఫొటో కచ్చితంగా ఉండేది. ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఇప్పటిలా... అప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ ఉండి ఉంటే.. గాయత్రి రెడ్డికి కావ్య పాప కంటే ఎక్కువ క్రేజ్ ఉండేదని డెక్కన్ ఛార్జర్స్ అభిమానులు అంటూ ఉంటారు.
రోహిత్ శర్మ కెరీర్..
డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఓనర్ టీ వెంకటరామ్ రెడ్డి కూతురు గాయత్రి రెడ్డి. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీని ఆయనే సొంతం చేసుకున్నారు. డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్ పేరిట బరిలోకి దిగిన ఆ జట్టు 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలో టైటిల్ గెలిచింది. రోహిత్ శర్మకు కెరీర్ ఇచ్చింది కూడా డెక్కన్ ఛార్జర్సే. 2008 నుంచి 2010 వరకు రోహిత్ ఈ జట్టుకే ఆడాడు.
ఫిచర్స్ ఎడిటర్గా..
ఇక గాయత్రి రెడ్డి లండన్లో డిగ్రీ పూర్తి చేసి డెక్కన్ క్రానికల్ పేపర్లో ఫిచర్స్ ఎడిటర్గా పనిచేసింది. ట్రావెల్, ఫ్యాషన్, స్పోర్ట్స్ విభాగాల్లో అనేక కథనాలు రాసింది. సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది. ఐపీఎల్ కాంట్రాక్ట్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డెక్కన్ ఛార్జర్స్ జట్టుపై 2012లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేటు వేసింది.
దాంతో డెక్కన్ చార్జర్స్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి గాయత్రి రెడ్డి స్పాట్ లైట్లో లేకుండా పోయింది.