ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కడం లేదు. డాషింగ్ ఓపెనర్ అయిన పృథ్వీ షాకు చోటు ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో మ్యాచ్లోనూ అతన్ని బెంచ్కే పరిమితం చేశారు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్గాను పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో పృథ్వీ సెంచరీతో రాణించాడు. టైటిల్ గెలిచిన ముంబై జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి పృథ్వీ షాను పక్కనపెట్టడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడా? సందేహపడ్డారు. కానీ పృథ్వీ షాను పక్కనపెట్టడానికి గల అసలు కారణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా జియోసినిమాతో మాట్లాడిన గంగూలీ.. పృథ్వీ షాను ఎందుకు పక్కనపెట్టాల్సి వచ్చిందో వివరించాడు. ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ను ఆడించాలనుకున్నామని, రికీ భుయ్ వంటి మిడిలార్డర్ బ్యాటర్ను ఆడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు.
'పృథ్వీ షా ఓపెనర్. మేం మిచెల్ మార్స్, డేవిడ్ వార్నర్తో ఓపెనింగ్ చేయించాలని డిసైడ్ అయ్యాం. రికీ భుయ్ మిడిలార్డర్ బ్యాటర్. అతను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అయితే రికీ భుయ్ కోసమే పృథ్వీ షాను పక్కనపెట్టలేదు. విభిన్నమైన ఓపెనింగ్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. మిచెల్ మార్ష్-డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు ఓపెనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. దాంతోనే వారిని కొనసాగిస్తున్నాం.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఫిట్నెస్ సమస్యలు ఉండటం.. రంజీ ట్రోఫీలో పెద్దగా రాణించకపోవడం కూడా పృథ్వీ షాను పక్కన పెట్టాడానికి కారణమయ్యాయని దాదా పేర్కొన్నాడు. ఇక మోకాలి గాయంతో పృథ్వీ 6 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీతోనే అతను మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చాడు.
అండర్ 19 ప్రపంచకప్తో తారా జువ్వలా భారత జట్టులోకి దూసుకొచ్చిన పృథ్వీ షా.. అంతే వేగంగా దూరమయ్యాడు. గాయాలు, అనవసర వివాదాలు అతని కెరీర్ను నాశనం చేశాయి. కనీసం ఐపీఎల్ 2024 సీజన్లోనైనా సత్తా చాటుదామని భావించిన అతనికి నిరాశే ఎదురైంది.