ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ఆ ఫ్రాంచైజీకి నష్టం చేస్తుందని భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, పార్దీవ్ పటేల్ అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడటాన్ని రోహిత్ శర్మ, సూర్యకుమార్లు అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉందని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.
అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. 'ఐపీఎల్ గేమ్ ప్లాన్ షో'లో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. హార్దిక్ కాస్త పొగరు కలిగిన వ్యక్తి. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లోకి కూడా అతను తన పొగరును తీసుకెళ్తాడు. అలాంటి కెప్టెన్సీలో ఆడటాన్ని రోహిత్, సూర్య అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది.

ఎందుకంటే ఈ ఏడాది కూడా తానే సారథిగా ఉంటానని రోహిత్ శర్మ భావించాడు. రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ సారథ్యం తనకే దక్కుతుందని సూర్యకుమార్ యాదవ్ ఆశించాడు. హార్దిక్ పాండ్యా మాత్రం ఇవేవి పట్టించుకోకుండా జట్టును నడిపించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి హార్దిక్ సారథ్యంలో రోహిత్, సూర్య ఆడటం ఆసక్తికరంగా ఉంటుంది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ముంబై ఇండియన్స్ సారథ్యం హార్దిక్ పాండ్యాపై అనవసర ఒత్తిడి తీసుకొస్తుందని పార్దీవ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. 'హార్దిక్ పాండ్యాపై చాలా ఒత్తిడి ఉండనుంది. ఐదు సార్లు టైటిల్ అందించిన సారథిని పక్కనపెట్టి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం హార్దిక్కు సవాల్తో కూడుకున్నది. అంతేకాకుండా గత 10 ఏళ్లుగా రోహిత్ సారథ్యంలో ఆడిన ఆటగాళ్లు.. హార్దిక్ మాట వినడం కూడా కష్టమే.'అని పార్దీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదులైన తర్వాత పూర్తి షెడ్యూల్ను ప్రకటించనుంది.