చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సారథ్య బాధ్యతలు అందుకోవడంపై రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. సీఎస్కే జట్టును నడిపించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, అజింక్యా రహానేలు తనకు అండగా ఉంటారని, ఎలాంటి ఆందోళనకు గురవ్వడం లేదని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 ట్రోఫీ ఫొటో షూట్ ముందు ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్రకటించింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ల ఫొటో షూట్లో పాల్గొన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు టైటిళ్లు అందించిన ధోనీ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. అతని లెగసిని కొనసాగించాల్సి ఉంది. రెండేళ్ల క్రితం రవీంద్ర జడేజాకు ఈ అవకాశం ఇవ్వగా అతను పూర్తిగా తడబడ్డాడు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించడం రుతురాజ్ గైక్వాడ్కు ఓ బిగ్ టాస్క్గా చెప్పవచ్చు.
అయితే అతనికి దేశవాళీ క్రికెట్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం.. మైదానంలో ఏం జరిగినా ప్రశాంతంగా ఉండే స్వభావం కలిసొస్తుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కెప్టెన్సీ స్వీకరించడం ఎలా ఉందని రుతురాజ్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'సీఎస్కే సారథ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. జట్టు నాపై ఉంచిన పెద్ద బాధ్యత. ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడిన జట్టుకు సారథ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇది అంత సులువైన పని కాదని తెలుసు.
కానీ జట్టులో ధోనీ భాయ్, జడ్డూ భాయ్, అజ్జూ భాయ్(అజింక్యా రహానే) ఉన్నారు.
వాళ్లు నన్ను గైడ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురవ్వడం లేదు. కెప్టెన్గా ఆటను ఆస్వాదించేందుకు సిద్దమవుతున్నా'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. శుక్రవారం చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సీఎస్కే అమీతుమీ తేల్చుకోనుంది.