రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్ల్లో 50 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా సంజూ శాంసన్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సంజూ శాంసన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. 2020 నుంచి సంజూ శాంసన్ ప్రతీ సీజన్ తొలి మ్యాచ్లో 50 ప్లస్ రన్స్ చేశాడు.

ఐపీఎల్ 2020 సీజన్ తొలి మ్యాచ్లో 74 పరుగులు చేసిన సంజూ శాంసన్.. 2021 ఫస్ట్ మ్యాచ్లో(119) సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ తొలి మ్యాచ్లో 55, ఐపీఎల్ 2023 సీజన్లో 55 రన్స్, తాజా సీజన్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే మరే బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. సంజూ శాంసన్తో పాటు రియాన్ పరాగ్( 29 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 43) పర్వాలేదనిపించాడు.
లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది. నికోలస్ పూరన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 58)ల పోరాటం వృథా అయ్యింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.