ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ పేరును మార్చుకుంది. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో తమ కొత్త పేరును ప్రకటించింది. తమ జట్టు పేరులో బెంగళూరు పేరును ట్విస్ట్ చేసింది.
ఇప్పటికే ఈ పేరు మార్పుపై కన్నడ సినీ స్టార్స్ రిషభ్ శెట్టి, కిచ్చా సుదీప్, రష్మిక మందన్నాలతో ప్రమోషనల్ వీడియోలు చేసిన ఆర్సీబీ.. అన్బాక్స్ ఈవెంట్లో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మంధానలు తమ జట్టు కొత్త పేరును ఆవిష్కరించారు.

ఇప్పటి వరకు Royal Challengers Bangalore(RCB)గా రాసారు. అయితే ఇక్క నుంచి Royal Challengers Bengaluru గా మార్చారు. Bangalore అనే పదంలో స్పెల్లింగ్ను మాత్రమే మార్చారు. ఈ పేరు మార్పు సందర్భంగా 'ఇది ఆర్సీబీ నూతన శకం'అని ఈ ముగ్గురు స్టార్స్ కన్నడలో పేర్కొన్నారు.
ఈ ముగ్గురు ఆర్సీబీ స్టార్స్ బజర్ నొక్కగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి మళ్లీ రాగా.. న్యూ జెర్సీ, న్యూలోగా.. Bengaluru అనే పదం కనిపించాయి. అనంతరం డీజే అలన్ వాల్కర్కు ఆర్సీబీ అతని పేరు మీద జెర్సీ అందజేసింది. దివంగత హీరో అశ్విని పునీత్ రాజ్కుమార్ పేరు మీద కూడా ఓ జెర్సీని ప్రజెంట్ చేశారు. కర్ణాటక మాజీ క్రికెటర్, పేసర్ ఆర్ వినయ్ కుమార్ను ఆర్సీబీ 2024 హాల్ ఫేమ్గా ప్రకటించారు.
అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లంతా స్టేజీపైకి రాగా.. అందరూ గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. మహిళల టీమ్ టైటిల్ విజయంతో ఆర్సీబీ కొత్త అధ్యాయనం ప్రారంభమైందని విరాట్ కోహ్లీ కన్నడలో తెలిపాడు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్లను డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మహిళల టీమ్కు ఆర్సీబీ పురుషుల టీమ్ గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. మైదానంలో పురుషుల టీమ్ ప్లేయర్స్ ఇరువైపుల నిల్చొని చప్పట్లతో మహిళల టీమ్కు స్వాగతం పలకగా.. స్మృతి మంధాన టైటిల్తో ముందుకు నడిచింది. మిగతా అమ్మాయిలు ఆమెను అనుసరిస్తూ మైదానంలోకి అడుగుపెట్టారు.