ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని రోహిత్ శర్మను భయపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఫస్ట్ స్లిప్లో ఫీల్డ్ చేస్తున్న రోహిత్ శర్మ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఫీల్డ్ సెటప్పై అక్కడి నుంచే మాట్లాడుతుండగా.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఆకస్మాత్తుగా తన సమీపింగా రావడంతో రోహిత్ శర్మ గజ్జున వణికాడు. సదరు అభిమానికి దూరంగా జరిగాడు. చివరకు అతని అభిమానని గ్రహించి.. హగ్ ఇచ్చాడు.

అతని పక్కనే ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా సదరు అభిమాని హగ్ చేసుకున్నాడు. అనంతరం తనంతట తానే మైదానం బయటకు రాగా.. సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రోహిత్ శర్మ తనలో తాను నవ్వుకున్నాడు. అనవసరంగా భయపడ్డాను కదా! అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.
ఇటీవల బెంగళూరు వేదికగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ అభిమాని ఇలానే మైదానంలోకి దూసుకొచ్చి తన అభిమాన ఆటగాడి కాళ్లు మొక్కాడు. అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమాని పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు. మైదానం బయటకు తీసుకొచ్చి దారుణంగా చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. అభిమానులు ఆర్సీబీ ఫ్రాంచైజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్లతో 32) రాణించారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యుజ్వేంద్ర చాహల్(3/11) ముంబై పతనాన్ని శాసించారు. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీసారు.