ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నాడనే ప్రచారం జోరు అందుకుంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తనను తప్పించడంపై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని, వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో అతను పాల్గొంటాడని ఆ జట్టుకు చెందిన ఓ ఆటగాడు మీడియాకు తెలిపాడు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. మెగా ఆక్షన్ ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆటగాళ్ల అంగీకారంతోనే ఈ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముంబై ఇండియన్స్పై అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ.. కేకేఆర్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో..
అవసరమైతే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా రోహిత్ శర్మను తీసుకునేందుకు కేకేఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం ఈ సీజన్లో ప్రతీ జట్టు సగం మ్యాచ్లు ఆడిన తర్వాత ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
కుదిరితే ఈ ఆప్షన్ ద్వారా రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కుదరకపోతే వచ్చే ఏడాది మెగా ఆక్షన్లో రోహిత్ శర్మ కోసం కేకేఆర్ ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెట్టనుంది. అంతకుముందు పికప్ ఆప్షన్ కింద రోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉంటే నేరుగా తీసుకోనుంది. లేదంటే వేలంలో భారీ ధర వెచ్చించనుంది.
రోహిత్ సైతం
రోహిత్ శర్మ సైతం గతంలో ఓ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ తర్వాత ఏ ఫ్రాంచైజీకి ఆడాలనుకుంటే అది కేకేఆర్ మాత్రమేనని వెల్లడించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కేకేఆర్ జట్టులో చేరుతాడని అతని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. కేకేఆర్ టీమ్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ గైడెన్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేకేఆర్ దుమ్మురేపుతుందని జోస్యం చెబుతున్నారు. ఒకవేళ రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తిరిగిచ్చినా.. లేదంటే అతన్ని ముంబై ఓనర్స్ కాంప్రమైజ్ చేసినా..హిట్ మ్యాన్ ముంబై జట్టులోనే కొనసాగుతాడు. ముంబై ఓనర్స్ను వ్యతిరేకంగా రోహిత్ వెళ్లలేడు.
తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..
ఇక ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్సీ మార్పు కారణంగా ముంబై ఇండియన్స్ రెండు గ్రూప్లుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మధ్వాల్, తిలక్ వర్మ ఒక గ్రూప్గా.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లతో పాటు ఇతర ఆటగాళ్లు మరో గ్రూప్గా విడిపోయినట్లు నేషనల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజే ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.