ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బస్ డ్రైవర్ అవతారమెత్తాడు. తమ టీమ్ బస్ను నడిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం శనివారం ముంబై ఇండియన్స్ వాంఖడే మైదానంలో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించగా ఆటగాళ్లంతా హాజరయ్యారు.

ప్రాక్టీస్ ముగించుకొని ముంబై ఇండియన్స్ బస్సులో వెళ్లేందుకు సిద్దమవ్వగా.. రోహిత్ శర్మ అందరికి షాకిచ్చాడు. డ్రైవర్ సీటులో కూర్చొని బస్సును నడిపాడు. తన డ్రైవింగ్ను వీడియో తీయాలని మొబైల్ను సహచర ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్కు అందించాడు.
అప్పటికే ముంబై ఇండియన్స్ అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో చేరగా.. రోహిత్ శర్మ బస్ డ్రైవింగ్ చేయడం చూసి అవాక్కయ్యారు. గట్టిగా అరుస్తూ రోహిత్ శర్మను అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినా.. రోహిత్ శర్మనే జట్టును ముందుకు నడిపిస్తున్నాడని, చివరకు బస్ డ్రైవర్గా కూడా బాధ్యతలు చేపట్టడాని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో డ్రైవర్గా మారడని సెటైర్లు పేల్చుతున్నారు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించింది. వరుసగా హ్యాట్రిక్ మ్యాచ్ల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్పై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీని చిత్తు చేసింది. ఇప్పటి వరకు మొత్తం ఐదు మ్యాచ్ల్లో రెండు నెగ్గిన ముంబై పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ను కూడా ఓడించి జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యానే అయినా.. మైదానంలో రోహిత్ శర్మనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులను రోహిత్ శర్మనే చేస్తున్నాడు.