టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బీసీసీఐ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన మాటలను రికార్డ్ చేయవద్దని చెప్పినా స్టార్ స్పోర్ట్స్ వినలేదని, తన ప్రైవసీకి భంగం కలిగేలా ప్రసారం చేసిందని మండిపడ్డాడు.
స్నేహితులు, సహచర ఆటగాళ్లతో సరదాగా జరిపే సంభాషణలను రికార్డ్ చేయడం ద్వారా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్లేయర్లకు ప్రైవసీ లేకుండా పోయిందని రోహిత్ శర్మ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తే ఏదో ఒక రోజు అభిమానులు, క్రికెటర్లు, క్రికెట్ మధ్య ఉన్న విశ్వాసం దెబ్బ తింటుందని హెచ్చరించాడు.

నమ్మకం పోతుంది..
'క్రికెటర్లకు ప్రైవసీ లేకుండా పోయింది. ట్రైనింగ్ లేదా మ్యాచ్ జరిగే రోజుల్లో సహచర ఆటగాళ్లు, స్నేహితులతో సరదాగా మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేస్తున్నారు. ఇది ఆటగాళ్ల గోప్యత, స్వేచ్చను హరిస్తోంది.
నా మాటలను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్ను కోరినప్పటికీ.. నా ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఆ వీడియోను ప్రసారం చేశారు. ప్రత్యేకమైన కంటెంట్, వ్యూస్ల కోసం ఇలాంటి పనులు చేస్తే ఏదో రోజు ఆటగాళ్లు, అభిమానులు, క్రికెట్ మధ్య ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది.'అని రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆడియో మ్యూట్లో పెట్టు..
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ.. తమ మాటలను రికార్డ్ చేయవద్దని బ్రాడ్కాస్టర్ కెమెరామెన్కు సూచించాడు. తన ముంబై రంజీ టీమ్ మేట్స్తో రోహిత్ శర్మ సరదా మాట్లాడుతుండగా.. బ్రాడ్కాస్టర్ కెమెరాలు రోహిత్ను చూపించే ప్రయత్నం చేసాయి.
దాంతో ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ ఆడియో మ్యూట్లో పెట్టాలని కెమెరామెన్కు సూచించాడు. ఇప్పటికే ఓ ఆడియోతో తాను ఇబ్బందుల్లో పడ్డానని తెలిపాడు. తాను చెప్పినా వినకుండా ఈ వీడియోను ప్రసారం చేయడంతో రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతోనే సోషల్ మీడియా వేదికగా స్టార్ స్పోర్ట్స్పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఇదే చివరి సీజన్ అంటూ..
ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు ప్రకంపనలు సృష్టించాయి. ముంబై ఇండియన్స్ టీమ్ పేరును ప్రస్తావించకుండా ఆ జట్టును ఉద్దేశించి రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి.
ఇదంతా వాళ్లపై ఆధారపడి ఉంది. నేను ఏమీ పట్టించుకోవట్లేదు. ఏదేమైనా, అది నా ఇల్లు, నేను నిర్మించుకున్న దేవాలయం. మొత్తానికి ఇదే నా చివరిది'' అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.