ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. పిచ్లో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు. గత మ్యాచ్లో ఎలా ఉందో అలానే ఉండనుంది. గతంలో ఢిల్లీకి ఆడిన నేను ఇప్పుడు కేకేఆర్కు ప్రాతినిథ్య వహిస్తున్నాను. ఈ మార్పు పట్ల నేను సౌకర్యంగానే ఉన్నాను.

జీవితంలో ఏదైనా జరగవచ్చు. అయితే విధానానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. పవర్ ప్లేలో ధాటిగా ఆడటం సునీల్ నరైన్ బాధ్యత. అతని రోల్ పట్ల క్లారిటీతో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లకు కూడా తమ బాధ్యత ఏంటో తెలుసు. జట్టులో ఒక మార్పు చేశాం. అంగ్రీష్ రఘువంశీ జట్టులోకి వచ్చాడు.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. అయితే ఈ మ్యాచ్లో పిచ్ కాస్త స్లోగా మారే అవకాశం ఉంది. గత మ్యాచ్లో ఫామ్ అందుకోవడంతో పాటు విజయాన్ని నమోదు చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.
ఫాస్ట్ బౌలర్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్లో కూడా వారు సత్తా చాటుతారని భావిస్తున్నా. తొలి రెండు మ్యాచ్లకు సంబంధించిన టీమ్ కాంబినేషన్ గురించి పెద్దగా ఆలోచించ లేదు. నెట్స్లో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజయానికి కావాల్సిన కాంబినేషన్తో మేం బరిలోకి దిగుతున్నాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. గాయంతో ఇబ్బంది పడుతున్న ముఖేష్ కుమార్ యాదవ్ స్థానంలో సుమిత్ కుమార్ను తీసుకున్నాం.'అని రిషభ్ పంత్ తెలిపాడు.
తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్(కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ
ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిక్ దార్ సలామ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్.