ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్పై ఐపీఎల్ నిర్వాహకులు ఓ మ్యాచ్ నిషేధం విధించారు. లీగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దాంతో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోయి తదుపరి మ్యాచ్కు దూరమయ్యాడు.
ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను మరో ప్లేయర్ నడిపించనున్నాడు. ఈ సీజన్లో పదే పదే స్లో ఓవర్ రేట్కు కారణమైన రిషభ్ పంత్.. చివరకు ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్లోనూ ఆ జట్టు స్లో ఓవర్ రేట్కు కారణమైంది. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు రిషభ్ పంత్పై ఓ మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. 'ఐపీఎల్ రూల్స్ను అతిక్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్పై జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించాం.
రాజస్థాన్ రాయల్స్తో గత మంగళవారం(మే 7) జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్కు గురవ్వడం ఇది మూడో సారి. దాంతో అతని మ్యాచ్ ఫీజులో రూ. 30 లక్షలు కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించాం.
జట్టులోని మిగతా ఆటగాళ్లతో పాటు ఇంప్టాక్ ప్లేయర్కు కూడా రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులోని 50 శాతం ఏది తక్కువైతే దాన్ని జరిమానగా విధించాం. మ్యాచ్ రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ అప్పీల్ చేయగా.. బీసీసీఐ అంబుడ్స్మన్ సమీక్షించి మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని సమర్థించారు.'అని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ రిషభ్ పంత్ దూరమవ్వడం.. ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాటింగ్తో పాటు కెప్టెన్గా రిషభ్ పంత్ను భర్తీ చేసే ఆటగాడు ఆ జట్టులో ఎవరూ లేరు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో నిలిచింది.