ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ సహనం కోల్పోయాడు. ఔటైన ఫ్రస్టేషన్లో బ్యాట్ను నేలకు కొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులే చేశాడు.
యుజ్వేంద్ర చాహల్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రిషభ్ పంత్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. చాహల్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో పంత్ వెనుదిరిగాడు. కీలక సమయంలో ఔటవ్వడంతో తీవ్ర అసహనానికి గురైన పంత్... మైదానం ధాటి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లే క్రమంలో బ్యాట్ను నేలకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాదిన్నరగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్.. ఐపీఎల్ 2024 సీజన్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలో ఆశించిన ప్రదర్శనను కనబర్చలేకపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ విఫలమవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. పంజాబ్ కింగ్స్తో తొలి మ్యాచ్లో 18 పరుగులే చేసి వెనుదిరిగిన పంత్.. అప్పుడు కూడా తీవ్ర ఆగ్రహంతో బ్యాట్ను నేలకు కొట్టాడు. అంతటితో ఆగకుండా డగౌట్లో కూర్చున్న హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మోకాలిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 3 సిక్స్లతో 29), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 3 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.