టీమిండియా స్టార్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ సెన్సేషన్ రింకూ సింగ్ ఓ కుర్రాడికి క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమాయత్తం అవుతున్న రింకూ సింగ్.. కేకేఆర్ ఏర్పాటు చేసి ప్రీ ట్రైనింగ్ క్యాంప్లో చెమటోడుస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా రింకూ సింగ్ కొట్టిన ఓ భారీ సిక్సర్.. ఓ కుర్రాడి నుదిటికి తగిలింది. ఈ విషయం తెలుసుకున్న రింకూ సింగ్ వెంటనే.. ఆ బాలుడి దగ్గరికి వెళ్లి గాయాన్ని పరిశీలించి క్షమాపణలు చెప్పాడు.
కోల్కతా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ సదరు బాలుడికి కేకేఆర్ క్యాప్ను బహుమతిగా అందజేశాడు. రింకూ సింగ్ ఆ టోపీని తీసుకొని సంతకం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. దాంతో ఈ వీడియో వైరల్ కాగా.. రింకూ సింగ్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రింకూది గొప్ప మనసు అంటూ కొనియాడుతున్నారు.

ఐపీఎల్ 2023లో సంచలన ప్రదర్శన కనబర్చిన రింకూ సింగ్.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఓ మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు బాది సంచలన విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో అతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత భారత్ తరఫున టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో రింకూ సింగ్.. తన సూపర్ పెర్ఫామెన్స్ను కొనసాగిస్తే.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. మార్చి 23న కోల్కతా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో కేకేఆర్ తమ క్యాంపైన్ ప్రారంభించనుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.