తమ ఆటగాడిని ఉద్దేశించి ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేసిన వ్యాఖ్యలపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆటగాళ్లను విమర్శిస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మురళీ కార్తీక్.. తన కామెంట్రీలో ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ను ఉద్దేశించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతన్ని తక్కువ చేసేలా మాట్లాడాడు. 'ఒకరి చెత్త మరొకరికి నిధి'అని యశ్ దయాల్ను ఉద్దేశించి అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఆర్సీబీ గట్టి కౌంటర్ ఇచ్చింది.

'యశ్ దయాల్ ఎప్పటికి తమ నిధి'అని ట్విటర్ వేదికగా బదులిచ్చింది. అతని ఫొటోను కూడా షేర్ చేసింది. ఆర్సీబీ కౌంటర్ ట్వీట్పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలా ఆటగాళ్లకు ఫ్రాంచైజీ మద్దతుగా నిలిస్తే.. మరింత చెలరేగుతారని కామెంట్ చేస్తున్నారు.
గతేడాది గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన యశ్ దయాల్.. కేకేఆర్తో జరిగిన ఓ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. కేకేఆర్ సెన్సేషన్ రింకూ సింగ్ ధాటికి చివరి ఐదు బంతుల్లో వరుసగా 5 సిక్స్లు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్లో 30 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు.
ఈ దారుణ ప్రదర్శనతో తీవ్ర ట్రోలింగ్కు గురైన అతను తీవ్ర మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. గుజరాత్ కూడా అతన్ని వేలంలోకి వదిలేయగా..ఆర్సీబీ రూ. 5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఆర్సీబీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా యశ్ దయాల్ రాణిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయడంతో పాటు 23 పరుగులే ఇచ్చాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో శిఖర్ ధావన్ను యశ్ దయాల్ అద్భుతంగా కట్టడి చేశాడు. దాంతో పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఛేజింగ్లో విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్తో విజయాన్నందుకుంది.