Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న సీజన్ ఓపెనర్ మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్ ఐదో బంతికి తీసిన సింగిల్తో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి కోహ్లీ 377 మ్యాచ్లు.. 360 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు.

క్రిస్ గేల్ 345 ఇన్నింగ్స్ల్లోనే 12 వేల పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్గా 12వేల టీ20 పరుగులు చేసిన ఆరో బ్యాటర్గా కోహ్లీ రికార్డుకెక్కాడు. క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(13360), కీరన్ పొలార్డ్(12900), అలెక్స్ హేల్స్(12319), డేవిడ్ వార్నర్(12065) కోహ్లీ కన్నా ముందున్నారు. ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు 7284 రన్స్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ ప్లేయర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48), వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
విరాట్ కోహ్లీ(20 బంతుల్లో సిక్స్తో 21), రజత్ పటీదార్(0), గ్లేన్ మ్యాక్స్వెల్(0), కామెరూన్ గ్రీన్(18) తీవ్రంగా నిరాశపరిచారు. సీఎస్కే పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ధాటికి 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 100 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ అనూజ్ రావత్ సంచలన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. మూడు భారీ సిక్స్లతో ఇన్నింగ్స్ను గాడినపెట్టాడు. కార్తీక్ సైతం అతనికి అండగా నిలవడంతో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 95 పరుగులు జోడించారు.