కెప్టెన్సీ మార్పు నిర్ణయమో లేక ఐపీఎల్ 2024 సీజన్ పేలవ ప్రదర్శననో తెలియదు కానీ ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ క్రేజ్ పడిపోయింది. తాజా సీజన్ ముందు వరకు హయ్యెస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. కానీ తాజా నివేదికల ప్రకారం బ్రాండ్ వాల్యూ విషయంలో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.
ఫైవ్ టైమ్ ఛాంపియన్గా సక్సెస్ ఫుల్టీమ్గా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత బ్రాండ్ వాల్యూ 204 మిలియన్ డాలర్లు మాత్రమే. తాజాగా హులిహాన్ లోకి అనే సంస్థ ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ టోర్నీ విలువ(16.4 బిలియన్ డాలర్లు) రూ. లక్ష 35 వేల కోట్లుగా పేర్కొంది. గత సీజన్తో పోల్చితే రూ. 28 వేల కోట్లు పెరిగింది.

పది ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) 231 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఆ జట్టుకు కలిసొచ్చింది. ఆర్సీబీ(227 మిలియన్ డాలర్లు), కేకేఆర్(216 మిలియన్ డాలర్లు) ముంబై ఇండియన్స్ కంటే ముందున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ విజయం కేకేఆర్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగేలా చేసింది. సంలచన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ కూడా తమ బ్రాండ్ వాల్యూ తగ్గకుండా కాపాడుకుంది.
రాజస్థాన్ రాయల్స్(133 మిలియన్ డాలర్లు), సన్రైజర్స్ హైదరాబాద్(132 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్(131 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్(124 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్(124 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్(101 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్(91 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు వేసి గుజరాత్ టైటాన్స్ నుంచి క్యాష్ ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం ఆ జట్టు అభిమానులతో పాటు ఆటగాళ్లకు కూడా నచ్చలేదు. దాంతో జట్టులో ఆటగాళ్ల విభేదాలు తలెత్తాయి. దాంతో ముంబై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ను అన్ఫాలో చేశారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను శత్రువులా చూస్తూ ఎగతాళి చేశారు.