ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో జరుగుతున్న కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ కేజీఎఫ్ బ్యాటర్లు చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), గ్లేన్ మ్యాక్స్వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు.
అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ 3 ఓవర్లలోనే 31 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. దాదాపు 30 నిమిషాల అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది.
వర్షం కారణంగా పిచ్ పూర్తిగా మారిపోయింది. బంతి అనూహ్యంగా టర్న్ అయ్యింది. దాంతో స్పిన్నర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో వ్యూహం మార్చిన కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ క్విక్ సింగిల్స్, డబుల్స్తో పరుగులు రాబట్టారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది.
ట్రేడ్ మార్క్ సిక్సర్లతో చెలరేగిన కోహ్లీ..
అనంతరం కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. ఫాఫ్ డుప్లెసిస్ ఆచితూచి ఆడాడు. సాంట్నర్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు బాదిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. అయితే అతని బౌలింగ్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బంతిని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమవ్వడంతో బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేవగా.. బౌండరీ లైన్ వద్ద మిచెల్ సాంట్నర్ అద్భుతంగా అందుకున్నాడు.
దాంతో తొలి వికెట్కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రజత్ పటీదార్ రాగా.. డుప్లెసిస్ తన బ్యాట్కు పని చెప్పాడు. జడేజా బౌలింగ్లో ఓ బౌండరీతో పాటు వరుసగా రెండు సిక్స్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రజత్ పటీదార్ కూడా భారీ సిక్సర్ బాదడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది.
వివాదాస్పద రీతిలో ఫాఫ్ ఔట్..
అయితే ఈ పరిస్థితుల్లో సాంట్నర్ బౌలింగ్లో ఫాఫ్ డుప్లెసిస్ దురుదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. రజత్ పటీదార్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ సాంట్నర్ చేతులు తాకి నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకింది. అయితే ఈ వికెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్తో కలిసి రజత్ పటీదార్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
ఈ ఇద్దరూ భారీ షాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు బాదడంలో పోటీపడ్డారు. హాఫ్ సెంచరీకి చేరువైన రజత్ పటీదార్(41)ను శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్కు వచ్చిన దినేశ్ కార్తీక్.. ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాది జట్టు స్కోర్ను 200 ధాటించాడు. అయితే అదే జోరులోఆడే ప్రయత్నం చేసిన దినేశ్ కార్తీక్(15) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ బౌండరీ బాదడంతో 18 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్లో మ్యాక్స్వెల్ 6, 4 బాది 13 పరుగులు పిండుకున్నాడు.