ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 27 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో పాటు మెరుగైన రన్రేట్ సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. మరోవైపు సమష్టి వైఫల్యంతో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శివమ్ దూబే వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

చెలరేగిన కేజీఎఫ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), గ్లేన్ మ్యాక్స్వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రవీంద్ర జడేజా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్), ఎంఎస్ ధోనీ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్(2/42) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.

దెబ్బతీసిన మ్యాక్సీ..
218 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గ్లేన్ మ్యాక్స్వెల్ వేసిన తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్(0) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్(4)ను యశ్ దయాల్ పెవిలియన్ చేర్చడంతో సీఎస్కే 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. ఆర్సీబీ స్పిన్నర్లను ఆచితూచి ఆడిన ఈ జోడీ.. పేసర్లపై ఎదురుదాడికి దిగారు. దాంతో పవర్ ప్లేలో సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన రహానే(33)ను లాకీ ఫెర్గూసన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మలుపు తిప్పిన రనౌట్..
క్రీజులోకి శివమ్ దూబే రాగా.. దూకుడుగా ఆడిన రచిన్ రవీంద్ర 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే గ్లేన్ మ్యాక్స్వెల్ వేసిన 13వ ఓవర్లో శివమ్ దూబే ఇచ్చిన సునాయస క్యాచ్ను సిరాజ్ నేలపాలు చేశాడు. కానీ అదే ఓవర్లో శివమ్ దూబేతో సమన్వయ లోపంతో రచిన్ రవీంద్ర రనౌట్గా వెనుదిరిగాడు. ఈ వికెట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
కామెరూన్ గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లో శివమ్ దూబే(7) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. సిరాజ్ బౌలింగ్లో ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్కు మిచెల్ సాంట్నర్(3) ఔటయ్యాడు. దాంతో మ్యాచ్పై ఆర్సీబీ పట్టు బిగించింది.
క్రీజులోకి ధోనీ రాగా.. జడేజా భారీ సిక్సర్లతో బయటపెట్టాడు. యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్లో 13 పరుగులు చేసిన ఈ జోడీ.. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో 15 పరుగులు పిండుకుంది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
యశ్ దయాల్ సంచలనం..
సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 12 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో జడేజా 6, 4 బాదగా.. ధోనీ బౌండరీ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో సీఎస్కేకు 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోనీ సిక్సర్ బాది మరుసటి బంతికి ఔటయ్యాడు.
తర్వాతి రెండు బంతుల్లో యశ్ దయాల్ సింగిల్ మాత్రమే ఇవ్వడంతో.. చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే యశ్ దయాల్ చివరి రెండు బాల్స్ డాట్ చేయడంతో ఆర్సీబీ విజయంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైంది.