హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లోనూ నిరాశపరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ ప్రక్షాళనకు నడుం బిగించింది. ముందుగా హెడ్ కోచ్ మైకేల్ హెస్సెన్పై వేటు వేసి జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్కు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్.. అప్కమింగ్ సీజన్లో ఆర్సీబీని నడిపించనున్నాడు.
ఆర్సీబీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఆండీ ఫ్లవర్.. టీమ్ బలహీనతలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ముందుగా తనకు అనుకూలండా ఉండే సపోర్ట్ స్టాఫ్ను తెచ్చుకునేందుకు సిద్దమయ్యాడు.

అలాగే టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు పేపర్ వర్క్ సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్ల ఫామ్, రికార్డ్స్, అనుభవాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుండటంతో తన పనిని వేగవంతం చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో అప్కమింగ్ ఐపీఎల్ సీజన్ కూడా చాలా ముందుగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వదులుకునే ఆటగాళ్ల జాబితాను ఆండీ ఫ్లవర్ సిద్దం చేశాడు.
వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్తో పాటు షెహ్బాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా, జోష్ హజెల్ వుడ్, ఫిన్ అలెన్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లకు ఉద్వాసన పలకాలని ఆండీ ఫ్లవర్ నిర్ణయించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఫినిషర్ పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్ ఆ జోరును కొనసాగించలేకపోయాడు.
13 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. 11.67 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్స్ల్లో డకౌటయ్యాడు.
అతనితో పాటు వానిందు హసరంగా కూడా దారుణంగా విఫలమవ్వడం ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఆర్సీబీ మిడిలార్డర్తో పాటు లోయరార్డర్ బలహీనంగా ఉంది. ఈ రెండు విభాగాలను పటిష్టం చేయడంపై ఆండీ ఫ్లవర్ ఫోకస్ పెట్టాడు.