వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మహిళల టీమ్కు ఆర్సీబీ పురుషుల టీమ్ గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో మంగళవారం ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ను తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళల టీమ్ డబ్ల్యూపీఎల్ టైటిల్తో హాజరైంది. ఇక తమ ఫ్రాంచైజీ మహారాణులకు ఆర్సీబీ పురుష ఆటగాళ్లు గౌరవ వందనం ఇచ్చారు. మైదానంలో పురుషుల టీమ్ ప్లేయర్స్ ఇరువైపుల నిల్చొని చప్పట్లతో మహిళల టీమ్కు స్వాగతం పలకగా.. స్మృతి మంధాన టైటిల్తో ముందుకు నడిచింది. మిగతా అమ్మాయిలు ఆమెను అనుసరిస్తూ మైదానంలోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఈ గాడ్ ఆఫ్ హానర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారుతోంది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్వెల్లు కూడా అమ్మాయిల విజయాన్ని అభినందించారు. గత 16 ఏళ్లుగా పురుష క్రికెటర్లు సాధించలేని ట్రోఫీని.. అమ్మాయిలు రెండో సీజన్లోనే అందుకున్నారు. అమ్మాయిల స్పూర్తితో పురుష క్రికెటర్లు కూడా టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలినక్స్ దూరమయ్యారు. వారు స్వదేశం వెళ్లిపోవడంతో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ను స్మృతి మంధాన తన మొబైల్ ద్వారా వీడియో కాల్తో చూపించింది. మైదానమంతా తిరిగి ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు మహిళా క్రికెటర్లు ధన్యవాదాలు తెలిపారు.
గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడింది. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.