ఐపీఎల్ 2024 సీజన్ను ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్ డకౌట్తో ప్రారంభించారు. చెన్నై సూపర్ కింగ్స్తో చెపాక్ మైదానం వేదికగా జరుగుతున్న సీజన్ ఓపెనర్లో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. రజత్ పటీదార్ త్రీ బాల్ డక్గా వెనుదిరగ్గా.. గ్లేన్ మ్యాక్స్వెల్ గోల్డెన్ డక్ అయ్యాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అటాకింగ్ గేమ్తో బౌండరీల మోత మోగించాడు. దాంతో ఆర్సీబీ 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. డుప్లెసిస్ను కట్టడి చేసేందుకు రుతురాజ్ గైక్వాడ్.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రంగంలోకి దింపాడు.

అతను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆర్సీబీకి ఊహించని షాకిచ్చాడు. ముందుగా జోరు మీదున్న ఫాఫ్ డుప్లెసిస్కు ఉచ్చు బిగించి రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్తో ఫలితాన్ని రాబట్టిన ముస్తాఫిజుర్.. ఆ తర్వాత రజత్ పటీదార్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దీపక్ చాహర్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే గ్లేన్ మ్యాక్స్వెల్ సైతం కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు.
దాంతో ఒక పరుగు వ్యవధిలోనే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్తో కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. డకౌట్స్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్స్తో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ సీజన్లో రజత్ పటీదార్.. ఆర్సీబీకి విలన్గా మారనున్నాడని, మ్యాక్స్వెల్ కూడా పెద్దగా రాణించే అవకాశాలు కనిపించడం లేదని కామెంట్ చేస్తున్నారు. భారీ స్కోర్లు చేస్తారనుకున్న రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్వెల్ గుడ్డు పెట్టారని మరో అభిమాని అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఆట తీరు చూస్తుంటే టైటిల్ గెలవడం దేవుడెరుగు.. పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలవకపోతే గొప్పని అభిప్రాయపడుతున్నారు.