ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్లో పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70 ప్లస్ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లేలో 75 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

ఈ సీజన్లో కేకేఆర్తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 85/0 పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్(72/0), సన్రైజర్స్ హైదరాబాద్(76/0)తో జరిగిన మ్యాచ్ల్లో కట్టడి చేయలేకపోయారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు. మిడిల్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమైంది.