రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్లో 150 సిక్స్లు బాదిన తొలి జట్టుగా ఆర్సీబీ చరిత్రకెక్కింది. ఐపీఎలే కాకుండా ఓ టీ20 టోర్నీలోనే ఓ జట్టు 150 సిక్స్లు బాదడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఆర్సీబీ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ మొత్తం 16 సిక్స్లు బాది ఈ ఘనతను అందుకుంది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ 146 సిక్స్లతో ఈ జాబితాలో టాప్లో ఉండగా.. ఆర్సీబీ అధిగమించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ నాలుగేసి సిక్స్లు బాదగా.. ఫాఫ్ డూప్లెసిస్, కామెరూన్ గ్రీన్ మూడేసి సిక్సర్లు కొట్టారు.

దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్వెల్ చెరొక సిక్సర్ బాదారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), గ్లేన్ మ్యాక్స్వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్లో 218 పరుగులు చేయడం ద్వారా ఆర్సీబీ అరుదైన ఘనతను అందుకుంది. ఓ సీజన్లో అత్యధిక సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా.. ముంబై ఇండియన్స్, కేకేఆర్తో సమంగా నిలిచింది.
ఈ సీజన్లో ఆర్సీబీతో పాటు కేకేఆర్ 6 సార్లు 200 ప్లస్ రన్స్ చేసింది. 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కూడా ఆరు సార్లు 200 ప్లస్ రన్స్ చేసింది.