ఐపీఎల్ 2024 సీజన్లో నమోదవుతున్న భారీ స్కోర్లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. బ్యాటర్ల హవా నడుస్తున్న టోర్నీలో బౌలర్లను రక్షించాలని కోరాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 523 పరుగులు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75), సునీల్ నరైన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) మెరుపులు మెరిపించారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరణ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 54) , శషాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
టీ20 చరిత్రలోనే 261 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో నమోదైన స్కోర్లపై రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చాడు. 'ఎవరైనా బౌలర్లను కాపాడండి'అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు మరో భారత స్పిన్నర్, రాజస్థార్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఆ దేవుడే కాపాడాలన్నా'అంటూ దేవుడికి దండం పెడుతున్న ఏమోజీని షేర్ చేశాడు.
260 ప్లస్ లక్ష్యచేధనలో చివరి రెండు ఓవర్లలో బంతికి ఒక పరుగుగా సమీకరణం మారడం ఏంటోనని అశ్విన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక ఈడెన్ గార్డెన్స్లో ఉన్న బౌండరీల సైజ్ సాధారణమేనని ఓ కామెంట్ చేసిన కామెంట్పై కూడా అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేశాడు.