టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు. తన ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఏర్పాటు చేసిన ప్రీ ప్రాక్టీస్ క్యాంప్లో శనివారం చేరాడు. ఈ కుర్ర వికెట్ కీపర్కు రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే రీతిలో స్వాగతం పలికింది. రోమాలు నిక్కబొడిచేలా హోటల్ స్టాఫ్తో సెల్యూట్ కొట్టించింది.
రెడ్ కార్పెట్పై ధ్రువ్ జురెల్ నడుస్తుంటే ఇరువైపుల ఉన్న సిబ్బంది సెల్యూట్ సర్ అంటై స్వాగతం పలికారు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 'దేశ్ మేరే..'అనే హిందీ సాంగ్ను ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టింది. 'ఈ స్వాగతానికి నువ్వు అన్ని విధాల అర్హుడివి ధ్రువ్జురెల్'అని ఈ వీడియోకు క్యాప్షన్గా పేర్కొంది.

ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధ్రువ్ జురెల్ అదిరిపోయే ప్రదర్శన కనబర్చాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 46, 90, 39, 15 పరుగులతో సత్తా చాటాడు. ముఖ్యంగా నాలుగో టెస్ట్లో తీవ్ర కష్టాల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 90 పరుగులతో భారత విజయానికి బాటుల వేసాడు. రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ సంచలన ప్రదర్శనతో ధ్రువ్ జురెల్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్.. ధ్రువ్ జురెల్కు ప్రత్యేకమైన స్వాగత ఏర్పాట్లు చేసింది. గతేడాది ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్.. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో సత్తా చాటడంతో తుది జట్టులో రెగ్యూలర్గా కొనసాగనున్నాడు.