ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం బుధవారం(మే 8) ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ జరిగే ఉప్పల్లో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా ఉప్పల్ రోడ్లన్నీ జలమయ్యాయి. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సైతం జలమయమైంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా.. భారీ ఎత్తులో నీళ్లు చేరాయి.

హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు-మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై సందేహాలు నెలకొన్నాయి. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ను కూడా రద్దు చేసుకున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్.. వర్షానికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. ఇక ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ లభించనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి చెరో 6 విజయాలు నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో నాలుగో, ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.
మెరుగైన రన్రేట్తో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు మూడో స్థానానికి చేరి.. ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి మూడు మ్యాచ్ల్లో రెండింటిలో విజయం సాధించాలి. ఆరెంజ్ ఆర్మీ ఉప్పల్ వేదికగానే ఈ మూడు మ్యాచ్లు ఆడనుండటం కలిసొచ్చే అంశం. లక్నో సూపర్ జెయింట్స్(మే8), గుజరాత్ టైటాన్స్(మే16), పంజాబ్ కింగ్స్(మే18)లతో సన్రైజర్స్ తమ చివరి మూడు మ్యాచ్లను ఆడనుంది.