ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరడంతో ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నీ కీలక దశలో వర్షం ఐపీఎల్ టీమ్స్ను వణికిస్తోంది. గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై వరణుడు నీళ్లు జల్లాడు. మ్యాచ్ జరగకుండా అడ్డుపడి ఇంటికి సాగనంపాడు.
సోమవారం జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యిన విషయం తెలిసిందే. దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 19 పాయింట్లతో కోల్కతా నైట్రైడర్స్ తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు టాప్-2 బెర్త్ను ఖరారు చేసుకుంది.

గుజరాత్ టైటాన్స్ 11 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చివరి మ్యాచ్లో గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. గుజరాత్ టైటాన్స్ను ఇంటికి సాగనంపిన వర్షం.. ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్పై కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ, సీఎస్కేకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
శనివారం బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ రోజు బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
దాంతో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఫస్టాఫ్ సీజన్లో దారుణంగా విఫలమైన ఆర్సీబీ సెకండాఫ్లో అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
ప్రస్తుం 0.387 రన్రేట్తో ఆర్సీబీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఆర్సీబీ 18 ప్లస్ రన్స్ తేడాతో ఓడించాలి. లేదా 18.1 ఓవర్లలోనే సీఎస్కే విధించిన లక్ష్యాన్ని చేధించాలి. అప్పుడే సీఎస్కే కంటే మెరుగైన రన్రేట్ సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది.
అంతేకాకుండా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ చివరి రెండు మ్యాచ్ల్లో ఓడితే ఆర్సీబీతో పాటు, సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరుతాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి. 13 పాయింట్స్తో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
మరోవైపు సీఎస్కే.. సన్రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.