ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు చెపాక్ వేదికగానే ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్)తో పోటీపడుతుంది.
అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడి ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నసన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్కు ముందు చెపాక్ మైదానం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఉన్న రికార్డ్స్ ఆ జట్టు అభిమానులను కలవరపెడుతున్నాయి.

ఈ వికెట్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడగా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 8 మ్యాచ్ల్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్, ఒక మ్యాచ్ను టై చేసుకుంది. ఈ రికార్డ్స్ చూసిన సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. ఈ మ్యాచ్ గెలిచినట్టేనని నిట్టూరుస్తున్నారు.
చెపాక్ వికెట్ నెమ్మదిగా ఉండటంతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్కు టాప్ స్పిన్నర్ లేకపోవడం కలవరపెట్టే అంశం. వానిందు హసరంగా స్థానంలో వచ్చిన విజయ్కాంత్ వియాస్కాంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్ లేదా గ్లేన్ ఫిలిప్స్ను ఆడించి.. లోకల్ భాయ్ వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో సూపర్ ఫామ్లో ఉన్న స్పిన్నర్లు ఉన్నారు. లోకల్ భాయ్ రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ను ఎదుర్కోవడం సన్రైజర్స్ బ్యాటర్లకు సవాల్తో కూడుకున్న పనే. ముఖ్యంగా అశ్విన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎలిమినేటర్లో ఆర్సీబీ పతనాన్ని శాసించింది అతనే. చివరి 4 మ్యాచ్ల్లో అశ్విన్ 6.81 ఎకానమీతో 7 వికెట్లు తీసాడు.
తనకు అచ్చొచ్చిన చెపాక్పై అశ్విన్ చెలరేగనున్నాడు. ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉంది. అంతేకాకుండా ఉక్కపోత వాతావారణం ఉండే ఈ మైదానంలో విపరీతమైన డ్యూ రానుంది. దాంతో టాస్ గెలిచిన జట్లు ఛేజింగ్కు మొగ్గు చూపనున్నాయి. ఇక్కడ జరిగిన గత 7 మ్యాచ్ల్లో ఐదు సార్లు ఛేజింగ్ టీమ్సే విజయం సాధించాయి.