ఐపీఎల్ 2024 సీజన్ క్వాలిఫయర్-2 మ్యాచ్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఘోర అవమానం ఎదురైంది. క్వాలిఫయర్-1 తరహాలోనే న్యూట్రల్ వేదిక అయిన చెపాక్ మైదానం చైర్స్లోనూ ప్రత్యర్థి టీమ్ రాజస్థాన్ రాయల్స్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. స్టేడియం మొత్తం సీట్లలో మ్యాచ్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జెండాలు ఏర్పాటు చేశారు.
అహ్మదాబాద్ వేదికగా గత బుధవారం జరిగిన క్వాలిఫయర్-1లోనూ కేకేఆర్ జెండాలను ఇలానే పెట్టారు. అప్పుడే న్యూట్రల్ వేదికలో ఒక జట్టు జెండాలు ఎలా పెడుతారని సన్రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా క్వాలిఫయర్-2 మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా రాజస్థాన్ రాయల్స్ జెండాలే ప్రత్యక్షమవ్వడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

నిర్వాహకుల తప్పిదమా? లేక సన్రైజర్స్ హైదరాబాద్ మెనేజ్మెంట్ అలసత్వమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ జెండాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెపాక్ మైదానం కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని, తమ బ్యాటింగ్ సామర్థ్యంలో 70 శాతం చూపించినా సునాయసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఎయిడెన్ మార్క్రమ్, జయదేవ్ ఉనాద్కత్ తుది జట్టులోకి వచ్చారు. చెపాక్ మైదానం కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. మైదానం చాలా పెద్దదని, దాంతోనే ఈ మార్పులు చేశామని చెప్పాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.
తుది జట్లు:
సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టీ నటరాజన్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పోవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.