ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఆర్సీబీ వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 48), ఆండ్రీ రస్సెల్(20 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.

శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రమణ్దీప్ సింగ్(9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ (2/56), కామెరూన్ గ్రీన్(2/35) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/40), లాకీ ఫెర్గూసన్(1/47) తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 55), రజత్ పటీదార్(23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 3 ఫోర్లతో 24), కర్ణ్ శర్మ(7 బంతుల్లో 3 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు.
కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్(3/25) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ తప్పుకుంది. అద్భుతాలు జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో ఏడింటిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో 6 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్లకు ఆరు గెలిచినా.. ఆ జట్టు7 విజయాలతో 14 పాయింట్సే సాధిస్తుంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్లను మెరుగైన రన్రేట్తో గెలవాల్సి ఉంటుంది. అద్భుతాలు జరిగి ఆర్సీబీ తదుపరి 6 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి.. మెరుగైన రన్రేట్ సాధిస్తే టెక్నికల్గా అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లలో ఏదైనా ఒక్క జట్టు 7 విజయాలు 14 పాయింట్లే సాధిస్తే అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. ఆర్సీబీకి మెరుగైన రన్రేట్ ఉంటే ముందంజ వేస్తోంది. కానీ ఇది దాదాపు అసాధ్యం.