ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ ప్లేయర్ నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) సత్తా చాటాడు.

సందీప్ శర్మ సంచలనం..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జోస్ బట్లర్(25 బంతుల్లో 6 ఫోర్లతో 35), సంజూ శాంసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
ప్లేఆఫ్స్ చేరాలంటే..?
ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్కు ఇది ఐదో పరాజయం. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. తాజా పరాజయంతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో 6 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ ఆరు మ్యాచ్లకు ఆరు గెలవాలి. ఒక్కదాంట్లో ఓడితే మాత్రం రన్రేట్ కీలకం అవుతోంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఫామ్ చూస్తుంటే 6 మ్యాచ్ల్లో 5 గెలవడం అసాధ్యంగా అనిపిస్తోంది. సంచలన ప్రదర్శన కనబర్చితే తప్పా ముంబై ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ లక్నో సూపర్ జెయింట్స్తో ఆడాల్సి ఉంది.
అయితే ఇందులో మూడు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో జరగనుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.