హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లోనూ పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్ల్లో 6 మాత్రమే గెలిచిన పంజాబ్ కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరం కావడం.. స్టార్ ఆటగాళ్ల దారుణ వైఫల్యం పంజాబ్ విజయవకాశాలను దెబ్బతీసింది.
16 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న పంజాబ్ ఒకే ఒకసారి ఫైనల్ చేరింది. ఆ తర్వాత పేరు మార్చుకున్నా.. కొత్త కోచ్లను తెచ్చుకున్నా.. కెప్టెన్లను మార్చినా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కానీ టోర్నీ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠ మ్యాచ్లు ఆడే జట్టుగా అభిమానుల మదిలో నిలిచిపోయింది. సునాయసంగా గెలిచే మ్యాచ్లను చేజేతులా చేజార్చుకోవడం.. గెలిచిన మ్యాచ్ల్లో చివరి బంతి వరకు ఉత్కంఠగా ఆడటం పంజాబ్ శైలి.

ఐపీఎల్ 2023 వైఫల్యంతో పంజాబ్ జట్టు అప్కమింగ్ సీజన్ కోసం ప్రణాళికలకు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైంది. జట్టు వర్గాల ప్రకారం.. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో రూ.18.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సామ్ కరణ్ను కూడా వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
సామ్ కరణ్తో పాటు నాథన్ ఎల్లిస్, మాథ్యూ షార్ట్ వంటి విదేశీ ఆటగాళ్లను వదులుకునేందుకు రెడీ అయ్యిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుండగా.. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను పంజాబ్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకు కొనుగోలు చేసిన సామ్ కరణ్ దారుణంగా విఫలమయ్యాడు.
14 మ్యాచ్ల్లో 10 వికెట్లు మాత్రమే తీసిన సామ్ కరణ్.. బ్యాటింగ్లో 13 ఇన్నింగ్స్ల్లో 135.96 స్ట్రైక్ రేటుతో 276 పరుగులే చేశాడు. అతని వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బతీసింది. సామ్ కరణ్ వల్ల పంజాబ్ బౌలింగ్ ప్రణాళికలు కూడా దెబ్బతిన్నాయి.
ధావన్ గైర్హాజరీలతో జట్టును నడిపించడంలో కూడా సామ్ కరణ్ తడబడ్డాడు. మాథ్యూ షార్ట్ 6 మ్యాచ్ల్లో 117 పరుగులే చేసి విఫలమవ్వగా.. నాథన్ ఎల్లిస్ 10 మ్యాచ్ల్లో 13 వికెట్లే తీసాడు. ఈ వైఫల్యం నేపథ్యంలో ఈ ముగ్గురి ఆటగాళ్లను వదులుకునేందుకు పంజాబ్ సిద్దమైనట్లు తెలుస్తోంది.