ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒకే ఒక్క విదేశీ ప్లేయర్తో బరిలోకి దిగింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఇలా ఒకే విదేశీ ఆటగాడితో ఆడటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఓ జట్టు గరిష్టంగా నలుగురు ఓవర్సీస్ ఆటగాళ్లను ఆడించేందుకు వీలుంది. పంజాబ్ కింగ్స్లోనీ కీలక విదేశీ ఆటగాళ్లంతా టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో స్వదేశం పయనం అవ్వడంతో పంజాబ్ కింగ్స్ ఒక్క రిలే రోసౌతో బరిలోకి దిగింది. సామ్ కరణ్, లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో పాకిస్థాన్తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిపోయారు.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ అందుబాటులోకి ఉన్నప్పటికి అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిలే రోసౌతో మాత్రమే బరిలోకి దిగుతున్నామని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి జితేష్ శర్మ తెలిపాడు. ఓవర్సీస్ ఆటగాళ్లు లేకుండా విజయం కోసం ఆఖరి వరకు పోరాడటం గొప్ప అనుభూతినిస్తోందని చెప్పాడు.
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు.
చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42 ) సత్తా చాటారు. రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.