ఐపీఎల్ 2024 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించింది. తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను రూ. 20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన కమిన్స్ కోసం తగ్గేదేలే అన్నట్లు పోటీపడింది.
అయితే కమిన్స్ను అంత భారీ ధర పెట్టి కొనుగోలు చేయడంపై క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్యాట్ కమిన్స్కు అంత ధర చెల్లించడం అవసరమా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కమిన్స్ను తీసుకోవడం వెనుక సన్రైజర్స్ హైదరాబాద్ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన కమిన్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ కోణంలో ఆలోచించే అతనికి భారీ ధర చెల్లించినట్లు అర్థమవుతోంది. కమిన్స్ సారథిగా ఆస్ట్రేలియాకు అద్భుత విజయాలు అందించాడు. యాషెస్ సిరీస్ను రిటైన్ చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ టైటిల్ను అందించాడు.
ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి జట్టును అద్భుతంగా నడిపి ఫైనల్ చేర్చడమే గాక విజేతగా నిలబెట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో అతని సారథ్య పటిమ ఏంటో అందరికి తెలిసొచ్చింది. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అతనికి తిరుగులేదనే విషయం స్పష్టమైంది. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి కెప్టెన్గా ప్రకటించే అవకాశం ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి కూడా ఇదే సంకేతం ఇచ్చాడు. వేలం సందర్భంగా కమిన్స్ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. వరల్డ్ కప్ విన్నర్ అయిన కమిన్స్కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నాడు.
'కమిన్స్కు సన్రైజర్స్ సారథ్య బాధ్యతలు అప్పగించడంపై చర్చలు జరుగుతాయి. అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ మధ్యలో ఆటగాళ్లు చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా సారథిగా కమిన్స్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అతను వరల్డ్ కప్ విన్నర్. కాబట్టి అతన్ని కెప్టెన్ చేసే విషయంపై తప్పకుండా చర్చలు జరగుతాయి.'అని వెటోరి చెప్పుకొచ్చాడు.
కమిన్స్ కెప్టెన్గానే కాకుండా ఫ్రంట్ లైన్ బౌలర్గా సన్రైజర్స్కు కీలకం కానున్నాడు. ఐపీఎల్ అతను 45 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో ధాటిగా ఆడే సామర్థ్యం కూడా అతనికి ఉంది. లోయరార్డర్లో కమిన్స్ కీలకం కానున్నాడు.