సన్రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ అభిషేక్ శర్మపై ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. ఓ బౌలర్గా తాను మాత్రం అభిషేక్ శర్మకు అస్సలు బౌలింగ్ చేయనని చెప్పాడు. అతను స్వేచ్చగా ఆడుతున్న తీరు బౌలర్గా తనను భయపెడుతోందని తెలిపాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈ విజయం అద్భుతం. చాలా సంతోషంగా ఉంది. ఉప్పల్లో మేం ఏడు మ్యాచ్లకు ఆరు గెలిచాం. ఇది చాలా గొప్ప విషయం. ఈ సీజన్లో ఇంత మంది కుర్రాళ్లు సత్తా చాటుతారని ఊహించలేదు. మేం అసాధారణమైన క్రికెట్ ఆడాం. కుర్రాళ్లతో మా జట్టు గొప్పగా ఉంది. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు.
అతనికి నేను అస్సలు బౌలింగ్ చేయను. అతను స్వేచ్చగా ఆడుతున్న తీరు ఓ బౌలర్గా నన్ను భయపెడుతోంది. అతను పేసర్లపై మాత్రమే చెలరేగడం లేదు. స్పిన్నర్లను కూడా దంచికొడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ ఆటగాడు. అతని వయసు కంటే చాలా పరిణితితో కనబడుతున్నాడు.
పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ.. మా టాపార్డర్లో కీలక ఆటగాడిగా మారాడు. మా జట్టు ప్రదర్శన సంతృప్తినివ్వడంతో పాటు ఉత్సాహాన్నిస్తోంది. ఐపీఎల్లో నేను ఇప్పటి వరకు ఫైనల్స్ ఆడలేదు. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్తో పాయింట్స్ టేబుల్లో మా స్థానంపై స్పష్టత రానుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు.
చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42 ) సత్తా చాటారు. రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.