ఐపీఎల్ 2024 సీజన్కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. శుక్రవారం చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఇప్పటికే యావత్ దేశం ఐపీఎల్ ఫీవర్లో మునిగి తేలుతోంది.
అధికారిక బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలు లీగ్కు సంబంధించిన ప్రమోషన్స్తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మాజీ క్రికెటర్లు మాత్రం తమ అంచనాలతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఆ ఆర్సీబీ బ్యాటర్..
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. ఐపీఎల్ 2024 సీజన్లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఎవరో చెప్పాడు. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన షోలో మైకేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఓలీ సిల్వర్టన్తో కలిసి పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా.., రోహిత్ శర్మ బెస్ట్ స్ట్రైకరేట్ కలిగిన బ్యాటర్గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు.'ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్ట్రైక్రేట్ కలిగిన బ్యాటర్గా నిలుస్తాడు. కానీ టాప్ స్కోరర్ మాత్రం విరాట్ కోహ్లీనే. ఎందుకంటే అతను సుదీర్ఘ విరామం తర్వాత చాలా ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాడు. అంతేకాకుండా బెంగళూరులోని ఫ్లాట్ పిచ్లు అతను ఆరెంజ్ క్యాప్ అందుకునేలా సహాయపడుతాయి.'అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
యశస్విదే ఆరెంజ్ క్యాప్..
ఆడమ్ గిల్క్రిస్ట్ మాత్రం ఐపీఎల్ 2024 సీజన్లో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలుస్తాడని తెలిపాడు. అత్యధిక పరుగులు చేయడంతో పాటు హయ్యెస్ట్ స్ట్రైక్రేట్ కలిగిన ఆటగాడు కూడా అతనేనని జోస్యం చెప్పాడు. జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడని, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు సాధించాడని గిల్క్రిస్ట్ గుర్తు చేశాడు. అదే జోరును ఐపీఎల్లో కొనసాగిస్తాడని అభిప్రాయపడ్డాడు.
యశస్వి జైస్వాల్ రేసులో ఉన్నా.. కోహ్లీనే ఆరెంజ్ క్యాప్ వరిస్తుందని మైకేల్ వాన్ తెలిపాడు. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఓలీ సిల్వర్స్టోన్.. పంజాబ్ కింగ్స్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడని చెప్పగా.. మైకేల్ వాన్ ఏకీభవించాడు. కానీ భారత కండిషన్స్లో అతను ఏ మేరకు రాణిస్తాడనేది సందేహంగా మారిందన్నాడు.
టైటిల్ మాత్రం వారిదే..
అత్యధిక వికెట్లు తీసే బౌలర్గా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిలుస్తాడని మైకేల్ వాన్ జోస్యం చెప్పగా.. గిల్ క్రిస్ట్ మాత్రం మిచెల్ స్టార్క్ పర్పుల్ క్యాప్ అందుకుంటాడని తెలిపాడు. టైటిల్ మాత్రం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఈ ఇద్దరూ దిగ్గజాలు అంచనా వేసారు.