కోల్కతా నైట్రైడర్స్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణా.. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కేకేఆర్తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే .. నితీష్ రాణాతో కలిసి మాట్లాడాడు.
ఈ సందర్భంగా నితీష్ రాణా చేతి వేలి గాయం గురించి ప్రశ్నించగా.. అతను తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నితీష్ రాణా.. నీ చేతులు చూస్తుంటే ఏదో గాయమైనట్లు ఉంది. అంత మంచిదేనా?'అని హర్షా భోగ్లే ప్రశ్నించాడు. అంతా బాగానే ఉందని బదులిచ్చిన నితీష్ రాణా.. తన మిడిల్ ఫింగర్ను చూపించలేనని చెప్పాడు.

'అంతా బాగానే ఉంది సర్. నా ఫింగర్ను మీకు చూపించలేను. ఎందుకంటే అది మిడిల్ ఫింగర్. మీకు చూపించడం భావ్యం కాదు.'అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. 10 మ్యాచ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని, ఈ కఠిన సమయం తనకు సవాల్గా సాగిందని పేర్కొన్నాడు.
ఐపీఎల్లో తానేప్పుడు ఇన్ని మ్యాచ్లు బెంచ్కు పరిమితం కాలేదన్నాడు. కేకేఆర్ మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్పగా ఉందని, మ్యాచ్లో తాను ప్రభావం చూపగలనని నమ్మిందని తెలిపాడు. ప్రస్తుతం నితీష్ రాణా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. కేకేఆర్ టాప్-2 ప్లేస్ను కన్ఫామ్ చేసుకుంది.