ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 64) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పర్వదినాన నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్తో తెలుగోడి సత్తా ఏంటో చాటి చెప్పాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీకి తోడుగా అబ్దుల్ సమద్(12 బంతుల్లో5 ఫోర్లతో 25), ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 21) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ నాలుగు వికెట్లు, హర్షల్ పటేల్, సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీసారు. రబడాకు ఓ వికెట్ దక్కింది.

స్టార్ ఆటగాళ్లంతా తడబడిన పిచ్పై నితీష్ కుమార్ రెడ్డి మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ బ్యాటింగ్తో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించి తనకు ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ ఇన్నింగ్స్ను ట్రావిస్ హెడ్ ధాటిగా ప్రారంభించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. అయితే అర్ష్దీప్ సింగ్ తన రెండో ఓవర్లో ట్రావిస్ హెడ్తో పాటు ఎయిడెన్ మార్క్రమ్(0)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్రైజర్స్ మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్కు పంపించింది.
భారీ సిక్సర్తో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన అభిషేక్ శర్మ.. అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో సన్రైజర్స్ హైదరాబాద్ రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించగా.. సన్రైజర్స్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేసింది. నితీష్ కుమార్ రెడ్డి ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా రాహుల్ త్రిపాఠి డిఫెన్స్కే పరిమితమయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం..
క్రీజులోకి హెన్రీచ్ క్లాసెన్ రాగా.. నితీష్ కుమార్ రెడ్డి భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. డేంజరస్ క్లాసెన్(9)ను హర్షల్ పటేల్ ఔట్ చేయగా.. అబ్దుల్ సమద్తో కలిసి నితీష్ కుమార్ ధాటిగా ఆడాడు. హర్ప్రీత్ బ్రార్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన నితీష్ రెడ్డి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్ కెరీర్లో అతనికి ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ మరుసటి బంతికి అతను ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద శశాంక్ సింగ్ వదిలేసాడు. బౌండరీ కూడా ఆపలేకపోయాడు. మరుసటి బంతిని భారీ సిక్సర్ బాదిన నితీష్ రెడ్డి.. భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.
దెబ్బతీసిన అర్ష్దీప్..
మూడు బౌండరీలతో జోరు కనబర్చిన అబ్దుల్ సమద్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. అదే ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో నితీష్ కుమార్ రెడ్డి కూడా క్యాచ్ ఔట్గా వెనుదరిగాడు. క్రీజులోకి వచ్చిన కమిన్స్(3)ను రబడా క్లీన్ బౌల్డ్ చేయగా.. షాబాజ్ అహ్మద్ (14 నాటౌట్), జయదేవ్ ఉనాద్కత్(6 నాటౌట్) సిక్స్ బాది జట్టు స్కోర్ను 180 పరుగుల మార్క్ను ధాటించాడు.