క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కొందరు అభిమానులు చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో స్టార్లుగా మారుతుంటారు. గతంలో చాలా మంది ఇలా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. తాజా సీజన్లో కూడా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసును దోచేసింది.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఈ మిస్టరీ గర్ల్ డ్యాన్స్తో ఆకట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 36 బంతుల్లో 76 రన్స్ చేయాల్సిన సమయంలో ఆమెపై కెమెరామెన్ ఫోకస్ చేశారు.

దాంతో ఆ యువతి క్యూట్ స్టెప్పులతో అలరించారు. సదరు యువతి డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందం, అభినయం అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టా ఐడీ ఉంటే చెప్పండి బ్రేక్ ఇచ్చేద్దాం అని, మిచెల్ సాంట్నర్ ఔటయ్యేలా డ్యాన్స్ చేసిన ఆ యువతికి థ్యాంక్స్ అంటూ జోకులు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ 27 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ధోనీ, జడేజా చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 47), గ్లేన్ మ్యాక్స్వెల్(5 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16), ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. రజత్ పటీదార్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 41), కామెరూన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్పాండే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. మరో 9 పరుగులు చేసుంటే సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరేది.
రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రవీంద్ర జడేజా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42 నాటౌట్), ఎంఎస్ ధోనీ(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్(2/42) రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.