ఐపీఎల్ 2024 సీజన్కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చింది. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2024లో ముంబైని విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్ ఆల్రౌండర్ తనుష్ కొటియన్ను రూ. 20 లక్షల బేస్ప్రైజ్కు కొనుగోలు చేసింది.
రంజీ ట్రోఫీలో తనుష్ కొటియన్ 502 పరుగులతో పాటు 29 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. విపరీతమైన వర్క్లోడ్ కారణంగా తాను ఐపీఎల్ 2024 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆడమ్ జంపా గురువారం ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024కు ఫ్రెష్గా ఉండాలనే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆడమ్ జంపా తెలిపాడు.

అతన్ని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను మధ్యలోనే హ్యాండ్ ఇవ్వడంతో ముంబై యువ ప్లేయర్తో అతని స్థానాన్ని భర్తీ చేసింది.
వాస్తవానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనతోనే తనుష్ కొటియన్కు ఐపీఎల్ ఆడే అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అతని యాక్షన్పై అనుమానాలు రేకెత్తడంతో ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అయినా ఏ మాత్రం నిరాశ చెందని తనూష్ కొటియన్.. రంజీ ట్రోఫీలో అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటాడు. నెంబర్ 8లో బ్యాటింగ్ చేసే కొటియన్.. బరోడా, తమిళనాడుతో జరిగిన క్వార్టర్, సెమీఫైనల్ మ్యాచ్ల్లో 120, 89 నాటౌట్ పరుగులతో రాణించాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ రాబిన్ మింజ్ స్థానంలో కర్ణాటక యువ వికెట్ కీపర్ బీఆర్ శరత్ను తీసుకొంది. రాబిన్ మింజ్.. బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమవడంతో అతని స్థానాన్ని శరత్తో భర్తీ చేసింది. కర్ణాటక తరఫున 28 టీ20లు, 20 ఫస్ట్ క్లాస్, 43 లిస్ట్ఏ మ్యాచ్లు ఆడిన శరత్.. టీ20ల్లో 328 పరుగులు చేశాడు. అతనికి గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షల కనీస ధర చెల్లించనుంది.