ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో చిత్తయ్యింది. పేలవ బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు 277 పరుగులు సమర్పించుకున్న ఐపీఎల్ టీమ్గా అప్రతిష్టను మూటగట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్ల ఓడిన నేపథ్యంలోముంబై ఇండియన్స్ రెండు గ్రూప్లుగా చీలిందనే ప్రచారం ఊపందుకుంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు జట్టులో రెండు గ్రూప్లు మెయింటేన్ చేస్తున్నారని ఓ జాతీయ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడాన్ని సహించలేని జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రోహిత్ శర్మ గ్రూప్లో ఉన్నారని, హార్దిక్ పాండ్యా వైపు ఇషాన్ కిషన్తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఉన్నారని తెలిపింది.

రోహిత్ శర్మ గ్రూప్.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏ మాత్రం సహకరించడం లేదని, తొలి రెండు మ్యాచ్ల్లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో స్పష్టంగా కనిపించాయని పేర్కొంది. హార్దిక్ సూచనలను బుమ్రా పట్టించుకోకపోవడం.. హార్దిక్తో కలిసి తిలక్ వర్మ సరైన సమన్వయంతో బ్యాటింగ్ చేయకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని తెలిపింది.
హార్దిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్మెంట్ నుంచి పూర్తి సపోర్ట్ ఉందని, జట్టులోని అంతర్గత విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తుందని కూడా రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఓ అడుగు వెనుకేసి రోహిత్ శర్మ సలహాలు కోరుతున్నాడని, ఫీల్డ్ సెటప్ విషయంలోనూ రోహిత్ సలహాలు తీసుకుంటున్నాడని పేర్కొంది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యాపై కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు విపరీతంగా ద్వేషిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను తీవ్రంగా అవమానించిన అభిమానులు.. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ అలానే ఎగతాళి చేశారు. హార్దిక్ చేసే ప్రతీ పనిని భూతద్దంలో చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాటింగ్కు సిద్దమైన హార్దిక్ పాండ్యా డగౌట్లో మలింగాను లేపి అతని కుర్చిలో కూర్చోమనడాన్ని కూడా తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు.
జట్టులో గ్రూప్ మెయింటేన్ చేయడం రోహిత్ శర్మకు అలవాటేనని, విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా అతను ఇలానే గ్రూప్లు మెయింటేన్ చేశారని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.