IPL 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా.. ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అప్పుడే తమ సన్నాహకాలను మొదలుపెట్టింది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందే టీమ్ బలాన్ని పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. వేలానికి ముందు ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో ఓపెన్ అవ్వగా.. ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడిని జట్టులోకి తీసుకొంది.
ట్రేడింగ్ విండో ద్వారా వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ను కొనుగోలు చేసింది. రూ. 50 లక్షల అతని కనీస ధరకు తీసుకుంది. ట్రేడింగ్ విండో ద్వారా ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఒక ఆటగాడిని మరో ఆటగాడితో స్వాప్ చేసుకోవడంతో పాటు సదరు ప్లేయర్ డబ్బులకు కొనుగోలు చేయవచ్చు.

అప్కమింగ్ సీజన్కు సంబంధించిన ట్రేడింగ్ విండో నంబర్ 1న ఓపెన్ అయ్యింది. ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 12న నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 15లోపు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను వెల్లడించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై బీసీసీఐ ఫోకస్ పెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సీజన్ను స్వదేశంలోనే జరపాలా? లేక విదేశాల్లో నిర్వహించాలా? అనే విషయంపై బీసీసీఐ తేల్చుకోవాల్సి ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది.
గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. ఫైనల్కు వెళ్లకుండానే వెనుదిరిగింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే టీమ్ బలాలు, బలహీనతలపై ఫోకస్ పెట్టింది. అవసరం లేని ఆటగాళ్లను వదిలించుకొని కావాల్సిన వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది.
రొమారియో షెఫర్డ్ ఇప్పటి వరకు 4 ఐపీఎల్ మ్యాచ్లే ఆడాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో అతను సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించాడు.