ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుడి బాట పట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వరుస ఓటములతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా.. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ శివుడిని వేడుకున్నాడు. శుక్రవారం గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
సోమనాథ్ ఆలయ అర్చకుల సమక్షంలో పలు పూజలు చేశాడు. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఐదు టైటిళ్లు గెలిపించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే ప్రతీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేస్తున్నారు. అతన్ని ఓ విలన్లా చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పాండ్యా చేసే ప్రతీ పనిలో తప్పును వెతుకుతున్నారు. ఇది అతని కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అనవసర ఒత్తిడి కారణంగా మైదానంలో హార్దిక్ పాండ్యా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ నుంచి కూడా అతనికి పూర్తి సహకారం లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా.. అతను సహకరించడం లేదని, ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్లుగా విడిపోయిందనే కథనాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ అనవసర ఒత్తిడి నుంచి తనను గట్టెక్కించాలని, మానసిక ప్రశాంతతను కలగజేయాలని హార్దిక్ పాండ్యా గుడి బాట పట్టినట్లు అతని సన్నిహితులు మీడియాకు పేర్కొన్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం వాంఖడే మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఖాతా తెరవాలని హార్దిక్ భావిస్తున్నాడు.